ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విచిత్ర వాదనలు వినిపించడం దారుణమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. భూములు ఇచ్చిన రైతులతో సి.ఆర్.డి.ఎ. చేసుకున్న ఒప్పంద ఉల్లంఘన గురించి మాత్రమే హైకోర్టు తన తీర్పులో ప్రస్తావించిందని ఆయన అన్నారు.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించకుండా, రైతులు పడుతున్న క్షోభకు క్షమాపణ చెప్పకుండా అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. తను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అని చెప్పే జగన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు ఇళ్లు కట్టుకోవల్సిన అవసరం లేదు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి మూర్ఖపు నిర్ణయాల మూలంగా రాజధాని లేని రాష్ట్రంగా మారింది. అంతేకాదు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు రాష్ట్రం నుంచి తరలిపోయాయి. అయినా ముఖ్యమంత్రి ఇంకా తన అభివృద్ధి నిరోధక వాదనలే వినిపిస్తున్నారని నాదెండ్ల మనోహన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును గౌరవించాలని, రాజధాని రైతులకి న్యాయం జరిగే వరకూ జనసేన అండగా ఉంటుందని ఆయన తెలిపారు.