ఇదేదో చెరువు అనుకుంటున్నారా? అయితే అది తప్పే. ఇది ఏదో గ్రామానికి రోడ్డు అనుకుంటున్నారా? అది కూడా తప్పే. వర్షాకాలం కదా ఎక్కడో ఊర్లో ఇలా అయిందనుకుంటే కూడా మీరు పప్పులో కాలేసినట్లే. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీ. నిజం… మీరు నమ్మడం లేదు కదూ. చచ్చనట్టు నమ్మాలి. రాజంపేట నియోజకవర్గం లోని సిద్దవటం మండల పరిధిలోని కడపాయ పల్లి లింగంపల్లి జగనన్న లే అవుట్ పరిస్థితి ఇది. కడప నగరానికి అతి సమీపంలో ఉండేటువంటి సిద్ధవటం మండలం పరిధిలోని కడపాయ పల్లి లింగంపల్లి లో ఉండే జగనన్న కాలనీలో కనీస సౌకర్యాలు లేవు మహాప్రభో అంటూ అక్కడి వారు మొత్తకుంటున్నా పట్టించుకునే నాధుడే లేడు.
జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకోడానికి సరైన సౌకర్యాలు కల్పించకుండా ఇల్లు కట్టుకోమని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ కరెంటు సౌకర్యం కూడా లేకపోవడం గమనార్హం. ఏదో ఒక రకంగా ఇబ్బందులు పడి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నా కూడా ఇక్కడ విద్యుత్ ఇప్పటికీ ఇవ్వకపోవడం చాలా దౌర్భాగ్యపు పరిస్థితి. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవటం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జగనన్న కాలనీలలో మౌలిక వసతుల సదుపాయం లో రాజీ వద్దు అని చెప్పినా కూడా అధికారులు పట్టించుకోకపోవడం చాలా శోచనీయం.