రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు పథకం తాలూక ఫలాలు ప్రతి పేదవాడికీ అందాలంటే.. మన పరిధిలో ఉన్న ప్రాథమిక సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్దామని, లక్ష్యాలను చేరుకుందామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా లక్షల సంఖ్యలో ఇళ్లు మంజూరు చేయటమే ఇదే ప్రథమమని పేర్కొన్నారు.
అనుకున్న లక్ష్యాలను, నిర్ణీత కాలంలో చేరుకోవాలంటే జిల్లా స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అందరు అధికారులు సమన్వయ కృషి చేయాలని నిర్దేశించారు. విజయనగరం, పార్వతీపురం జిల్లా కలెక్టర్లకు అన్ని విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని సూచించారు. జగనన్న పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణాల పురోగతిపై విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈ సాయంత్రం ఆయన ఉమ్మడి జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ రాష్ట్రంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాల గురించి, సాధించిన ప్రగతి గురించి వివరించగా విజయనగరం, పార్వతీపురం జిల్లా కలెక్టర్లు ఎ. సూర్యకుమారి, నిశాంత్ కుమార్ లు ముందుగా ఆయా జిల్లాల్లో జరిగిన ఇళ్ల నిర్మాణాల పురోగతిని వివరించారు. ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను, సాధించిన ప్రగతి నివేదికలను తెలియజేశారు. నిర్ణీత గడువులోగా లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికాయుతంగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్లు అందించాలనే గొప్ప సంకల్పంతో సీఎం జగన్ ఈ మహోత్తర కార్యక్రమాన్ని తలపెట్టారని, పథకం తాలూక పూర్తి లక్ష్యాలను చేరుకునేందుకు అందరూ సమన్వయ కృషి చేయాలని పేర్కొన్నారు. ముందుగా జిల్లాల పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని, అప్పటికీ పరిష్కారం కాకపోతే రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నిర్నీత గడువులోగా రెండు జిల్లాలకు కేటాయించిన ఇళ్లను పూర్తి చేయాలని కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముందుకెళ్లాలని నిర్దేశించారు.
పనుల్లో మరింత జోరు కనిపించాలని, మరో రెండు నెలల్లో వీలుంటే జిల్లాలో పర్యటిస్తానని ఈ లోగా పురోగతి సాధించాలని పేర్కొన్నారు. గడప గడపలో భాగంగా ప్రతి ఇంటికీ వెళుతున్నామని, ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మంత్రి అన్నారు. ప్రభుత్వ ఉద్దేశాలను, ఆశయాలను అర్థం చేసుకొని ఇళ్ల నిర్మాణాలను ఒక మహా యజ్జంలా సాగించాలని పేర్కొన్నారు. అధికారులు తప్పకుండా స్థానిక ప్రజాప్రతినిధులు సహకారం తీసుకోవాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు కూడా తగిన సలహాలు, సూచనలు అందజేయాలని మంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
మంత్రి దృష్టికి వివిధ అంశాలు
కార్యక్రమంలో భాగంగా మంత్రి ప్రసంగం అనంతరం ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు గృహ నిర్మాణాల్లో ఉన్న వివిధ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి బిల్లులు మంజూరు చేయాలని, ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానం విషయంలో ఇబ్బందులు ఉన్నాయని పరిష్కరించాలని విన్నవించారు. ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్, విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, విజయనగరం, అరకు ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్సీలు సురేశ్ బాబు, రఘురాజు, విక్రాంత్, ఎమ్మెల్యేలు బొత్స అప్పలనరసయ్య, శంబంగి చిన వెంకట అప్పలనాయుడు, కంబాల జోగులు, కళావతి ఇతర ప్రజాప్రతినిధులు, విజయనగరం జేసీ మయూర్ అశోక్, పార్వతీపురం జేసీ ఓ. ఆనంద్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.