వలస కూలీలకు, నిరుపేద కుటుంబాలకు జన్ సాహస్ సంస్థ అండగా ఉంటుందని సంస్థ వైస్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్ అన్నారు. శనివారం దోమ మండల పరిధిలోని దొంగఎంకేపల్లి గ్రామంలో 40 కుటుంబాలకు, దోర్నాల్ పల్లి గ్రామంలో 15 నిరుపేద కుటుంబాలకు వికారాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ ప్రకాష్ కుమార్ తో కలిసి నిత్యవసర వస్తువులు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్ సాహస్ స్వచ్ఛంద సంస్థ వలస కూలీల పైన పని చేస్తుందని అన్నారు. అలాగే నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు అర్హులు పొందేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. అదేవిధంగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డు( బిఓసిడబ్ల్యు ) ప్రతి భవన కార్మికుడు పొందేలా సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు.
అనంతరం సర్పంచులు అశోక్ రెడ్డి, యాదయ్య సాగర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నిరు పేద కుటుంబాలకు నిత్యవసర వస్తువులు అందించడం చాలా సంతోషం అన్నారు. జిల్లా వ్యాప్తంగా సంస్థ చేస్తున్న సేవలను తమ గ్రామాల్లో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సంస్థ సేవలను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.
సంస్థ ద్వారా తమ గ్రామాలలో నిత్యవసర వస్తువులు పంపిణీ చేసినందుకు సంస్థ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జన్ సాహాస్ కో ఆర్డినేటర్లు అశోక్ నాయక్, భానుచందర్, రవి, శివ రాం తదితరులు పాల్గొన్నారు.