తనను అత్యంత నీచంగా విమర్శిస్తున్న వైసీపీ నాయకులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పు చూపించారు. తనను ప్యాకేజీ అని ఎవరైనా మాట్లాడితే దవడ వాచిపోయేలా కొడతానని పవన్కల్యాణ్ అన్నారు. ఇంతకాలం తన సహనమే వైకాపాను కాపాడిందని జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ అన్నారు. ప్యాకేజీ అంటే పళ్లు రాలగొడతానని ఆయన తెలిపారు. ‘బాపట్లలో పుట్టా… గొడ్డు కారం తిని పెరిగా’నని వ్యాఖ్యానించారు. ఒంగోలు గోపాలనగరంలో వీధి బడిలో చదివానన్నారు. ఇంకోసారి ప్యాకేజీ అని మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సభ్యత, సంస్కారం ఉన్నవాళ్లం కాబట్టి మౌనంగా ఉన్నామన్నారు. వైకాపా గూండాల్లారా ఒంటిచేత్తో మెడ పిసికేస్తానన్నారు. మనల్ని తిట్టే ప్రతి వ్యక్తి తోలు ఒలిచేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైకాపాతో తాను యుద్ధానికి సై అన్నారు. రాడ్లతోనా.. హాకీ స్టిక్కులతోనే.. దేంతో వస్తారో రండి తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. ఇప్పటివరకు తన సహనం చూశారన్నారు. ఇవాళ్టి నుంచి యుద్ధమే… మీరు రెడీనా అంటూ ఛాలెంజ్ చేశారు. తాను 3 పెళ్లిళ్లు చేసుకున్నానని పదేపదే మాట్లాడతారా? అని పవన్ మండిపడ్డారు. విడాకులు ఇచ్చిన తర్వాత ఇంకొకరిని చేసుకున్నానని స్పష్టం చేశారు. చట్టప్రకారం వారికి భరణం చెల్లించారని తెలిపారు. మొదటి భార్యకు రూ.5 కోట్లు, రెండో భార్యకు ఆస్తి రాసిచ్చానని చెప్పారు. కులాల పేరు పెట్టి విమర్శలు చేయడం సభ్యతా? అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి తనకు పోరాట పటిమ వచ్చిందని పవన్ అన్నారు. కడుపు కాలితే చేసే పోరాటమే యుద్ధమని తెలిపారు. తన గుండె చప్పుడైన తెలంగాణ నుంచి వచ్చిందే ఈ పోరాటం అని పవన్ చెప్పారు. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని తాము ఊరికే చెప్పలేదని… పల్నాడు బ్రహ్మనాయుడిని ఆదర్శంగా తీసుకుని చెప్పానని పవన్ అన్నారు. మాల కులానికి చెందిన కన్నమనాయుడుని సైనికాధిపతిగా చేశారని గుర్తు చేశారు. అన్ని కులాలు సమానమని చెప్పేందుకు చాపకూడు సిద్ధాంతం తెచ్చారన్నారు.
అధికారం అనేది ఒకటి, రెండు కులాలకే పరిమితమైందని పవన్ ధ్వజమెత్తారు. అణగారిన, వెనుకబడిన వర్గాలకు అధికారం రావాలని అభిప్రాయపడ్డారు. చాలా కులాలు.. జనాభా ఉండి అధికారం రాలేదని బాధపడుతున్నారని చెప్పారు. వైకాపాలోని కాపు నేతలు జగన్కు ఊడిగం చేస్తే సరిపోతుందని పవన్ ఎద్దేవా చేశారు. కాపులను మాత్రం లోకువ చేయవద్దని పవన్కల్యాణ్ కోరారు.విశాఖ ఉక్కు కర్మాగారం కోసం రాయలసీమలో ప్రాణత్యాగాలు చేశారని పవన్ గుర్తు చేశారు. విశాఖ ఉక్కు కోసం వైకాపా నేతలు ఏం చేశారని దుయ్యబట్టారు. కనీసం ఆ త్యాగధనుల చరిత్ర వైకాపా నాయకులకు తెలుసా అని నిలదీశారు. ఉత్తరాంధ్ర కోసం వైకాపా నేతలు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం ఉక్కు కర్మాగారం కోసం గనులు ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. ‘కార్మికులారా మీరు నిలబడతారా.. విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాకుండా మేం బాధ్యత తీసుకుంటాం’ అని పవన్ హామీ ఇచ్చారు. మీరు ఇంట్లో కూర్చుని మమ్మల్ని పోరాటం చేయమంటే చేయలేమని పవన్ అన్నారు. పటేల్ తర్వాత అత్యంత బలమైన అమిష్ షాతో తాను ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడానని చెప్పారు. పదవుల గురించి నేను తాపత్రయం పడటం లేదని… ముఖ్యమంత్రి అయితే మొదటగా అభివృద్ధి కోసమే పని చేస్తానని పవన్ అన్నారు.