తెలంగాణ జాతిపితగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ప్రొఫెసర్ జయశంకర్ భవిష్యత్ తరాలకు మార్గ నిర్ధేశకులని, జయశంకర్ సర్ ఆశయాలకు అనుగుణంగా సీయం కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
ఆదివారం నిర్మల్ పట్టణంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జయశంకర్ సార్ విగ్రహానికి పూలమల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర సాధనే ఆశగా, శ్వాసగా జీవించారన్నారు.
యావజ్జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికే ధారపోసిన ఆయన ఆశయం స్ఫూర్తిదాయకమన్నారు. యువత జయశంకర్ స్పూర్తితో ముందుకు సాగాలన్నారు. జయశంకర్ సార్ కలలు కన్నట్టు తెలంగాణను సీయం కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారని స్పష్టం చేశారు.
యావత్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ది, సంక్షేమ పథకాల అమలులో అగ్ర స్థానంలో ఉందన్నారు. నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ కూడలిని ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తాగా మంత్రి అల్లోల నామకరణం చేశారు. దీనికి సంబంధించిన కసరత్తును పూర్తి చేసి అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.