చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్టాభిషేకం బుధవారం ప్రారంభమైంది. ప్రతి ఆషాఢ మాసంలో జ్యేష్టా నక్షత్రం నుంచి శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎటి.చక్రవర్తి శేషాద్రి దీక్షితులు కంకణభట్టార్గా వ్యవహరించారు. ఇందులో భాగంగా ఉదయం శతకలశస్నపనం, మహాశాంతి హోమం చేపట్టారు.
ఆ తరువాత ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని తిరుచ్చిపై ఆలయ విమాన ప్రాకారంలో ఊరేగింపు చేపడతారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్, ఈవో అనిల్కుమార్ సింఘాల్, ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఇవో రవికుమార్రెడ్డి, సూపరింటెండెంట్ రాజ్కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.