భాగస్వామ్య పక్షాలకు కేంద్ర ప్రభుత్వంలో సరైన ప్రాతినిధ్యం ఉండాలని జనతాదళ్ (యునైటెడ్) డిమాండ్ చేసింది.
కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ప్రధాని నరేంద్ర మోడీ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యు) ఈ డిమాండ్ చేయడం గమనార్హం.
మిత్ర పక్షాలకు గౌరవ ప్రదమైన వాటా ఉన్నప్పుడే భాగస్వామ్యం పటిష్టంగా ఉంటుందని ముఖ్యమంత్రి నితిష్ కుమార్ సన్నిహితుడు ఆర్ సి పి సింగ్ నేడు పాట్నాలో తెలిపారు.
నితిష్ కుమార్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఆర్ సి పి సింగ్ జనతా దళ్ (యు) జాతీయ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు.
జెడియు కు ప్రస్తుతం లోక్ సభలో 16 మంది ఎంపిలు ఉన్నారు.
ఎన్ డి ఏ నుంచి 18 మంది ఎంపిలు ఉన్న శివసేన వెళ్లిపోయిన తర్వాత జెడియు అతి పెద్ద భాగస్వామిగా ఉంది. జెడియు కు రాజ్యసభలో ఐదుగురు సభ్యులు ఉన్నారు.