యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యాన్ని ఇస్తోందని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ అన్నారు. వివిధ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన 71 వేల మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసేందుకు దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన రోజ్ గార్ మేళాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ నుంచి వర్చువల్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.
ఇందులో భాగంగా సికింద్రాబాద్ లో ఏర్పాటుచేసిన రోజ్ గార్ మేళా కార్యక్రమంలో నూతనంగా కేంద్ర విభాగాల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలను మంత్రి కౌశల్ కిషోర్ అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు దేశ నిర్మాణంలో భాగస్వాములయ్యే అవకాశం కలిగిందని ఆయన తెలిపారు. రోజ్ గార్ మేళా ఉపాధి కల్పనను పెంపొందింప చేయడంలో ఒక ఉత్ప్రేరకంగా పని చేయగలదన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.
ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం మిషన్ మోడ్ లో పని చేస్తున్నదని ఆయన అన్నారు. భారత ప్రభుత్వంలోని వివిధ విభాగాలకు చెందిన జూనియర్ ఇంజినీర్స్, లోకో పైలట్స్, టెక్నీషియన్స్, ఇన్ స్పెక్టర్, సబ్ ఇన్ స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, స్టెనోగ్రాఫర్స్, జూనియర్ అకౌంటెంట్స్, గ్రామీణ్ డాక్ సేవక్, ఇన్ కమ్ టాక్స్ ఇన్ స్పెక్టర్స్, టీచర్స్,
నర్స్, డాక్టర్స్, సోషల్ సెక్యూరిటి ఆఫీసర్స్, పిఎ లు, ఎంటిఎస్ మొదలైన వేరు వేరు ఉద్యోగాలకు చెందిన 99 మంది అభ్యర్థులు నియామక పత్రాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్ కమ్ టాక్స్ చీఫ్ కమీషనర్ శిషీర్ అగర్వాల్, ఇన్ కమ్ టాక్స్ విభాగానికి చెందిన ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.