జర్నలిస్టు వృత్తిని, యూనియన్ పదవిని అడ్డుపెట్టుకొని ఖుత్బుల్లాపూర్ ప్రాంతంలో భూవివాదాల్లో తలదూరుస్తున్న రంగు వెంకటేష్ గౌడ్ ను బహిష్కరిస్తున్నట్లు టీయుడబ్ల్యుజె- ఐజేయు వెల్లడించింది. ఈ మేరకు టీయుడబ్ల్యుజె-ఐజేయు మేడ్చల్ జిల్లా కమిటీ నేడు ఒక ప్రకటన విడుదల చేసింది.
ఖుత్బుల్లాపూర్ ఏరియాలో 143 సంఘం నాయకుడిగా చెలామణి అవుతున్న రంగు వెంకటేష్ గౌడ్ సమాజం తిరస్కరించిన ఒక సూడో జర్నలిస్టుతో చేతులు కలిపి జర్నలిజం విలువలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కార్పోరేటర్ టిక్కెట్టు కోసం యూనియన్ ప్రతిష్టను తాకట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో వెంటనే స్పందించి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు అతనిని టీయుడబ్ల్యుజె- ఐజేయు నుండి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు. సెటిల్మెంట్లు, పైరవీలతో అక్రమ డబ్బు సంపాదనకు ఎగబడ్డ వారు ఎవరూ జర్నలిజం ముసుగులో ఉండరాదనే ఆశయంతో ఈ చర్య తీసుకున్నట్లు ప్రకటనలో టీయుడబ్ల్యుజె- ఐజేయు తెలిపింది.