శ్రీకాకుళం జిల్లాలో జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తమ జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. మంగళవారం స్థానిక ఎన్జీఓ హోంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రెడ్క్రాస్ చైర్మన్ జనన్మోహనరావు, ఐక్యవేదిక కన్వీనర్, సీనియర్ పాత్రికేయుడు కొంక్యాన వేణుగోపాల్, శాసనపు జోగినాయుడు హాజరయ్యారు. జాప్ అధ్యక్షులు సూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై రెడ్క్కాస్ చైర్మన్ జగన్మోహనరావు మాట్లాడుతూ జర్నలిస్టులు అలుపెరగని పోరాటం చేస్తున్నారని, జర్నలిస్టులు రాసే వార్తలపై పరువు నష్టం దావాలు సర్వసాధారణమని, అటువంటి వాటికి భయపడితే పత్రిక విలువలు దిగజారుతాయన్నారు. అవినీతిపరులు ఎంతిటివారైనా ఒక్క జర్నలిస్టే వారికి సమాధానం చెబుతారని, అటువంటి జర్నలిస్టులపై నిత్యం మానసిక వత్తిడి, దాడులు వంటివి జరుగుతున్నపుడే ఈ జర్నలిస్టు యూనియన్ల అండదండలు వారికి బలమన్నారు. ఐక్యవేదిక కన్వీనర్ కొంక్యాన వేణుగోపాలరావు మాట్లాడుతూ ప్రతి జర్నలిస్టుకి అవినీతిపరుడుపై ఎదిరించే మానసిన ధైర్యం ఉండాలన్నారు.