సమాజంలోని సమస్యలను వెలికితీయడంలో జర్నలిస్టులదే కీలక పాత్ర అని, అటువంటి జర్నలిస్టులు తమ ఆరోగ్యం పై శ్రద్ధ కలిగి ఉండాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం టీయూడబ్ల్యూజే ( ఐజేయు) ఆధ్వర్యంలో చిట్యాల గ్రామ శివారులోని దేశినేని శ్యామలమ్మ ఫంక్షన్ హాల్లో మెడికోవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ వారి సహకారంతో జిల్లాలోని జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
టీయూడబ్ల్యూజే (ఐజెయూ) రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి వైద్య పరీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, ఎన్నో సమస్యల్ని వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కారం దిశగా చొరవ చూపుతారని చెప్పారు. మన దేశంలో ఎంతోమంది గొప్ప జర్నలిస్టులు ఉన్నారని, పెద్ద పెద్ద కుంభకోణాలను బయట పెట్టడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
జర్నలిస్టులు సమయాభావం లేకుండా పని చేస్తుంటారు కాబట్టి, వారి సొంత ఆరోగ్యం పైన సైతం శ్రద్ధ వహించాలని సూచించారు. జర్నలిస్టులు ఈ మెడికల్ క్యాంపు సద్వినియోగం చేసుకొని తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం మేలని చెప్పారు. జిల్లా పౌర సంబంధాల అధికారి పి సీతారాం మాట్లాడుతూ కేవలం సమస్యలే కాకుండా ప్రభుత్వం చేసే మంచిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని విలేకరులకు సూచించారు. టియుడబ్ల్యూజే (ఐజెయు) రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో టి యు డబ్ల్యూ జె ప్రారంభమై 70 సంవత్సరాలు అవుతోందని, ఉమ్మడి జిల్లాలో 40 సంవత్సరాలుగా జర్నలిస్టుల సంక్షేమం కోసం టీయూడబ్ల్యూజే ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. సీనియర్ జర్నలిస్టు మల్యాల బాలస్వామి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడానికి జర్నలిజం గొప్ప అవకాశం అని అన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు యూనియన్ తరపున జిల్లా కలెక్టర్ ను శాలువాతో సన్మానించారు.
అదేవిధంగా డిపిఆర్ఓ సీతారాంను, జిల్లా వైద్యశాఖ అధికారి శ్రీనివాసులును, మెడికవర్ ఆసుపత్రి కార్డియాలజిస్ట్ దయా వాస్వనిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమ నిర్వహణను ముందుండి నడిపించిన జర్నలిస్టులు బొడ్డుపల్లి లక్ష్మణ్, మన్యం, తైలం అరుణ్ రాజ్ , గంధం దినేష్, కుమార్ లను కలెక్టర్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ ప్రతినిధులు, జర్నలిస్టులు, వైద్యశాఖ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్