లాక్ డౌన్ కాలంలో తెలంగాణ బిజేపి నాయకత్వం, కార్యకర్తలు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను బిజేపి జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా అభినందించారు. బుధవారం కేంద్ర, రాష్ట్ర సమన్వయ కర్త నూనె బాల్ రాజ్, జేపి నడ్డాతో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, తాజా పరిస్థితులను ఆయనకు వివరించారు.
అనంతరం ఎంపి అర్వింద్ తో కలిసి నూనె బాల్ రాజ్ మీడియాతో మాట్లాడారు. 58 రోజుల లాక్ డౌన్ టైంలో పేదలకు పార్టీ తరపున సహాయ సహకారాలు అందించినట్లు చెప్పారు. వలస కూలీలకు ఆహారం, నిత్యావసర సరకులు అందించినట్లు తెలిపారు. రోజు వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు చేశామన్నారు.
విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర నాయకత్వం చేసిన సేవలను జాతీయ అధినాయకత్వం గుర్తిస్తు అభినందించిందని ఆయన వివరించారు. కోవిద్ 19 ను ఎదుర్కొనే దిశలో ప్రధాని మోడి, హోం మంత్రి అమిత్ షా, కిషన్ రెడ్డి 24 గంటలు శ్రమిస్తున్నారని చెప్పారు. వారి స్పూర్తితో కరోనాపై మరింత దృఢ సంకల్పంతో పోరాడుతామని వివరించారు.