తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి సీనియర్ ఐఏఎస్ అధికారి జెఎస్ వి ప్రసాద్ ను నియమించేందుకు రంగం సిద్ధం అయినట్లు తెలిసింది. జెఎస్ వి ప్రసాద్ ప్రస్తుతం రెవెన్యూ శాఖ కార్యదర్శిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షిస్తున్నారు.
ఆయన దేవాదాయ శాఖ కమిషనర్ గా కూడా అదనపు బాధ్యతలు వహిస్తున్నారు. చాలా కాలంగా సరైన పోస్టింగు లేకుండా ఉన్న జె ఎస్ వి ప్రసాద్ కు ఇటీవలె రెవెన్యూ శాఖలోని కీలక దేవాదాయ శాఖ అప్పగించారు. మరో ఏడాది వరకూ పదవీవిరమణ సమయం ఉన్నందున తనకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పని చేయాలని ఉన్నట్లు ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఆలోచిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. అయితే జె ఎస్ వి ప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ వోగా రావడం ఇప్పటికే తిరుమలలో తిష్ట వేసుకుని కూర్చున్న ఇద్దరు ఉన్నత స్థాయి వ్యక్తులకు ఇష్టంలేదని చెబుతున్నారు.
అందువల్ల వారు జె ఎస్ వి ప్రసాద్ నియామకాన్ని అడ్డుకుంటున్నట్లు తెలిసింది. ఆయన ఇప్పటికే దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యదర్శిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్స్ అఫిషియో సభ్యుడుగా ఉన్నందున ప్రత్యేకంగా ఈవోగా నియమించాల్సిన అవసరం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
అయితే ఇవేవీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టించుకునే అవకాశం లేదని కూడా అంటున్నారు. ముక్కు సూటిగా వ్యవహరిస్తూ నిజాయితీగా పని చేసే జెఎస్ వి ప్రసాద్ కు తిరుమల తిరుపతి దేవస్థానం అప్పగించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. త్వరలో సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులకు స్థానచలనం కలిగించేందుకు నిర్ణయించినందున ఆ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జె ఎస్ వి ప్రసాద్ ను నియమించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రికి సన్నిహితుడైన మరో సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నందున ఆదేశాలు వచ్చే వరకూ చెప్పే వీలులేదు.