వరంగల్ ఎంజీఎంలో సౌకర్యాలు లేక అటు కరోనా రోగులు ఇటు వైద్యులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా వైద్యులకు కనీసం పిపిఈ కిట్లు కూడా ఇవ్వడం లేదని అక్కడి డాక్టర్లు ఆరోపిస్తున్నారు. కరోనా రోగులకు నాసిరకం ఆహారం ఇవ్వడం నుంచి ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో వారు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొద్ది రోజుల కిందట పారిశుద్ధ్య పనివారు సమ్మె చేయడంతో వరంగల్ ఎంజీఎం మొత్తం అపరిశుభ్రంగా మారిపోయింది. తమకు సౌకర్యాలు కల్పించడంలేదని ఆరోపిస్తూ నిన్న రాత్రి కరోనా రోగికి చెందిన వ్యక్తులు ఒక జూనియర్ డాక్టర్ పై దాడి చేశారు.
అక్కడ ఉన్న కుర్చీ ఎత్తి జూనియర్ డాక్టర్ పై వేయడంతో భయంతో జూనియర్ డాక్టర్లు పరుగులు తీశారు. తాను మంత్రి కేటీఆర్ పిఏకు బంధువునని, తనకే ఎదురు చెబుతారా అంటూ ఆయన కేకలు వేసినట్లు అక్కడ ఉన్నవారు తెలిపారు. దాంతో డాక్టర్లు ఎంజీఎంలో అత్యవసర విభాగాన్ని బహిష్కరించారు.
ఫలితంగా అత్యవసర విభాగాలలోని సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వం సౌకర్యాలు కల్పించకపోతే కేటీఆర్ పిఏ అయినా ఎవరి బంధువు అయినా తాము ఏం చేయగలమని డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.