యాదృచ్చికం అయినా కూడా ఆంధ్రప్రదేశ్ లో పని చేసిన ఈ ఇద్దరు ప్రముఖ వ్యక్తులూ బీహార్ కు చెందిన వారే. ఇద్దరూ ఉన్నత స్థాయి వారే. ఒకరు నేడు పదవీ విరమణ చేయగా మరొకను నేడు అత్యున్నత స్థానానికి చేరుకున్నారు.
నేడు పదవీ విరమణ చేసిన ప్రముఖ వ్యక్తి ఎవరంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ రాకేష్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ఎన్నో సంచలనాత్మక తీర్పులు వెలువరించిన జస్టిస్ రాకేష్ కుమార్ కు నేటి సాయంత్రం ప్రజలు నీరాజనం పట్టి మరీ పదవి విరమణ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు.
సంచలనాత్మక తీర్పులు ఇచ్చిన జస్టిస్ రాకేష్ కుమార్ తన తీర్పులతో అమరావతి రైతులకు అండగా నిలిచారు. జస్టిస్ రాకేష్ కుమార్ తన తీర్పులతో న్యాయంవైపు నిలిచారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆయన ఇస్తున్న తీర్పులతో ఆయనపై కత్తికట్టింది. అవమానించింది.
అయినా సరే ఆయన దేనికీ తలొగ్గలేదు. చంద్రబాబునాయుడితో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు చెబుతున్నారని ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యాఖ్యానాలు చేసిన అధికార పార్టీ పెద్దలు న్యాయ వ్యవస్థతో యుద్ధం చేశారు….. పరోక్షంగా జస్టిస్ రాకేష్ కుమార్ పైన.
ఇక రెండో వ్యక్తి ఆదిత్యానాథ్ దాస్.
అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ఆదిత్యానాథ్ దాస్ నేటి సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు అత్యంత ఉన్నత స్థానం కల్పించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అధికార పార్టీ చెప్పినదల్లా చేసి ఇప్పటికే రెండు మూడు సార్లు కోర్టు మెట్లు ఎక్కిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సహానీ పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలోకి బీహార్ లో పుట్టి పెరిగి, ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఆదిత్యానాథ్ దాస్ వచ్చారు.
ఆదిత్యానాత్ దాస్ అత్యున్నత స్థానం లోకి రావడానికి ఒక రోజు ముందు ఐఏఎస్ అధికారి ఒకరు కోర్టు ధిక్కరణ కేసులో ఇరుక్కున్నారు. తను అనని మాటలు తనకు ఆపాదిస్తూ కౌంటర్ దాఖలు చేసిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ పై కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేయాలని జస్టిస్ రాకేష్ కుమార్ నిన్ననే ఆదేశాలు జారీ చేశారు.
బీహార్ కు చెందిన జస్టిస్ రాకేష్ కుమార్ పదవీ విరమణ చేస్తే రాజధాని రైతులు రోడ్లపైకి వచ్చి ఆయనకు వీడ్కోలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యానాథ్ దాస్ ఎంతో నిజాయితీపరుడు. ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తిగా పేరు పొందారు.
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆయన ఒకప్పుడు సహనిందితుడు. అయితే ఆ తర్వాత కోర్టు ఆదిత్యానాథ్ దాస్ ను కేసుల నుంచి విముక్తి చేసింది. ఇప్పుడు ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. వెళ్లిపోయిన జస్టిస్ రాకేష్ కుమార్ పనితీరును ప్రజలు చూశారు. ఇప్పుడు నిజాయితీపరుడైన ఆదిత్యానాథ్ దాస్ పనితీరును చూడాల్సి ఉంది.