నీతికి, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన జస్టిస్ రాకేష్ కుమార్ రిటైర్ మెంట్ జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసి నాలుగు రోజుల కిందట పదవీ విరమణ చేసిన జస్టిస్ రాకేష్ కుమార్ తన అనుభవాన్ని సాధారణ రైతుల కోసం వినియోగించేందుకు నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
అదీ కూడా తమ న్యాయమైన హక్కుల కోసం ఏడాదికి పైగా పోరాడుతున్న అమరావతి రైతుల పక్షాన వాదించేందుకు ఇక నల్లకోటు వేసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. రాజధానిని అక్కడ నుంచి తరలించేందుకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే విశాఖపట్నం, కర్నూలుకు రాజధాని భాగాలను తరలించేందుకు అన్ని ప్రయత్నాలు చేసుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని న్యాయ నిర్ణయాల కోసం వేచి చూస్తున్నది. అవన్నీ పూర్తి అయితే రాజధానిని మార్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నది.
ఊపిరి పీల్చుకున్న జగన్ ప్రభుత్వం
సిఆర్ డిఏ చట్టం రద్దు, అధికార వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటు తదితర అంశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ ప్రభుత్వం ఇంత కాలం జస్టిస్ రాకేష్ కుమార్ ఒక్కరే తమ నిర్ణయానికి అడ్డుగా ఉన్నారని భావించింది. ఆయన పదవి కాలం పూర్తి కావడంతో జగన్ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.
అయితే అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలించి, చట్ట పరంగా రాజధాని రైతులకు చేయాల్సిన అంశాలను అమలు చేయాల్సిందేనని జస్టిస్ రాకేష్ కుమార్ పూర్తిగా భావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా ఇచ్చిన ఆదేశాలు అన్నీ అదే పంథాలో ఉన్నాయి.
అయితే తన న్యాయపోరాటం పూర్తి కాలేదని జస్టిస్ రాకేష్ కుమార్ భావిస్తున్నారు. జస్టిస్ రాకేష్ కుమార్ పదవి విరమణ చేస్తున్నారని తెలియగానే వందలాది మంది రాజధాని రైతులు దారి పొడవునా నిలబడి ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.
కన్నీరు పెట్టుకున్న రాజధాని రైతులు
ఎంతో మంది రాజధాని రైతులు ఆయన పదవి విమరణ వార్త విని భావోద్వేగానికి గురయ్యారు. పదవీ విమరణ చేసిన ఆయనను చూసి ఏడ్చారు. ఇవన్నీ చూసిన ఆయన చలించిపోయారు. రాజధాని రైతులు తనపై పెట్టుకున్న ఆశలను మధ్యలోనే నిలుపుదల చేసేందుకు జస్టిస్ రాకేష్ కుమార్ మనసు అంగీకరించలేదు.
దాంతో ఆయన అమరావతి రైతులకు అనుకూలంగా హైకోర్టులో తన వాదనలు వినిపించేందుకు మళ్లీ అడ్వకేట్ రూపం ఎత్తేందుకు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ పోస్టునూ ఆయన అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. అందువల్ల మళ్లీ అడ్వకేట్ గా ప్రాక్టీసు ప్రారంభించి అమరావతి రాజధాని రైతుల తరపున కేసులు వాదించేందుకు సిద్ధపడుతున్నారు.
ఇలా చేసేందుకు ఆయనకు ఏవైనా ప్రతిబంధకాలు ఏర్పడితే అమరావతి రైతుల తరపున కేసులను ఇప్పటికే వాదిస్తున్న న్యాయవాదులకు అవసరమైన అన్ని న్యాయ సలహాలను అందించేందుకు కూడా ఆయన సిద్ధపడుతున్నారు.