ఆదాయం పెంచుకోవడం కోసం సామాన్యులపై విద్యుత్ భారం మోపుతారా? అంటూ టి పి సి సి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మహ్మద్ అజీజ్ పాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం టి పి సి సి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మహ్మద్ అజీజ్ పాషా మాట్లాడుతూ హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు గృహ వినియోగదారుల విద్యుత్ కనెక్షన్లు సాధారణ నివాసాలకు డొమస్టిక్ గా ఉన్న విద్యుత్ కనెక్షన్లను సుమారు 2000 వేల వరకు కామన్ సర్వీస్ కింద 2019 సంవత్సరంలో క్రింది స్థాయి విద్యుత్ ఉద్యోగులు మార్పిడిచేశారని తెలిపారు.
దీనితో గృహ వినియోగదారులకు వందల్లో రావాల్సిన విద్యుత్ బిల్లు వేల రూపాయలలో వస్తుందని,దీనితో వినియోగదారులు పరిశీలించగా విద్యుత్ శాఖాధికారులు మీ డొమెస్టిక్ కనెక్షన్ కామన్ సర్వీస్ కింద మార్చామని తేల్చి చెప్పటంతో షాక్ కి గురైన వినియోగదారులు మరలా 2020 సంవత్సరంలో తమ విద్యుత్ కనెక్షన్ డొమెస్టిక్ గా మార్చాలని దరఖాస్తు చేసుకున్నారని అన్నారు.
విద్యుత్ శాఖ లైన్మెన్లు కనీసం గృహాంలో ఎంతమంది ఉంటున్నారు,వారి వంటావార్పులు వేర్వేరుగా చేసుకుంటున్నారా లేదా అని గమనించకుండా ఇష్టానురీతిలో కనీసం నోటీస్ ఇవ్వకుండా డొమెస్టిక్ కనెక్షన్లు కామన్ సర్వీస్ కింద మార్చి వినియోగదారులపై విద్యుత్ బిల్లుల భారం మోపుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దరఖాస్తు చేసినా పట్టించుకోవడం లేదు
వినియోగదారులు సవరణ కోసం దరఖాస్తులు పెట్టుకొని రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నేటికి డొమస్టిక్ కనెక్షన్ గా మారలేదని,దీనితో వేల రూపాయలతో సామాన్య,మధ్య తరగతికి చెందిన కుటుంబాల వారు ప్రతి నెల బిల్లులు చెల్లిస్తున్నారని అన్నారు. పలువురు లైన్ మెన్ లు కేవలం అర్హత లేని ఇళ్లను కూడా డొమెస్టిక్ గా ఉన్నవారిని కామన్ సర్వీస్ కింద మార్చడం చాలా విచిత్రంగా ఉందని మహ్మద్ అజీజ్ పాషా అన్నారు.
దీని వల్ల స్లాబ్ రేట్లు పెరిగి వినియోగదారులపై అధికంగా విద్యుత్ బిల్లులు వస్తున్నాయని,గత రెండు సంవత్సరాల క్రితం సవరణకోసం విద్యుత్ శాఖ అధికారులకు ఈ వినియోగదారులు అర్జీలు పెట్టుకున్నా నేటి వరకు సవరణ జరగకపోవటంతో ప్రతినెలా వేల రూపాయలు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి వినియోగదారులకు దాపురించింది అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కేవలం విద్యుత్ శాఖ అధికారులు వినియోగదారులపై అధిక బిల్లును మోపటానికి క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బంది నిర్వాకం వలన గృహ వినియోగదారుల పరిస్థితులు,వారి స్థితిగతులు,కుటుంబ నేపథ్యం పరిశీలించకుండా కేవలం వినియోగదారుల నుండి అధిక బిల్లులు వసూలు చేసి ప్రభుత్వానికి ఆదాయం పెంచడం కోసం వినియోగదారులకు తెలియకుండా కరెంటు మీటర్లను డొమెస్టిక్ నుండి కామన్ సర్వీస్ కింద మార్చటం వలన స్లాబ్ రేట్లు పెరగటంతో బిల్లులు అధికంగా వస్తున్నాయని అన్నారు.
తక్షణమే కామన్ సర్వీస్ లను డొమెస్టిక్ సర్వీస్ క్రిందికి మార్చి వినియోగదారుల బిల్లులు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా అజీజ్ పాషా డిమాండ్ చేస్తూ హుజూర్ నగర్ విద్యుత్ శాఖ ఎఈ బి.రామ్ ప్రసాద్ కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కుల మల్లయ్య,ముశం సత్యనారాయణ,కోల మట్టయ్య, నియోజకవర్గ కళాకారులు కంబాల శ్రీనివాస్,దొంతగాని జగన్,నవీన్, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్