అక్రమంగా మూసివేసిన నీలమ్ జ్యూట్ మిల్లు తెరిపించాలని కార్మికులకు ఆరు రోజులు క్యాజువల్ లీవులు కొనసాగించాలని సిఐటియు అనుబంధ నీలమ్ జ్యూట్ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ముద్దాడ నాగేశ్వర రావు, నక్క సూరిబాబు నేడు శ్రీకాకుళం లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మే 2021 నుంచి అమలు కావాల్సిన నూతన వేతన ఒప్పందం కోసం సిఐటియు అనుబంధ యూనియన్ ఇచ్చిన ఛార్టర్ ఆఫ్ డిమాండ్స్ పై ఉప కార్మిక శాఖ అధికారి కార్యాలయంలో పలు దఫాలుగా జరిగిన చర్చల్లో 9.5% బోనస్ ఇవ్వటానికి, మూడు సంవత్సరాలు వరుసగా రోజుకి 4, 4.50, 5 రూపాయలు పెంపు చేయటానికి, పండుగ అడ్వాన్స్ 7000 రూ. ఇవ్వటానికి అంగీకారం కుదిరిందని తెలిపారు.
నిన్న విశాఖపట్నం జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వారి కార్యాలయంలో జరిగిన చర్చల్లో యాజమాన్యం కాజువల్ లీవులు 6 నుంచి 2 తగ్గించి 4 మాత్రమే ఇస్తానన్న ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు యాజమాన్యానికి, సంయుక్త కార్మిక కమిషనర్ కు యూనియన్ ప్రతినిధి బృందం తెలిపామని చెప్పారు. ఐ ఎఫ్ టి యు అనుబంధ సంఘం రెండు కాజువల్ లీవులు తగ్గించటానికి అంగీకరించటం కార్మిక ద్రోహమని సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు ఆర్. సురేష్ బాబు విమర్శించారు. కార్మికుల గుర్తింపు లేని ఐ ఎఫ్ టి యు అనుబంధ సంఘంతో యాజమాన్యం కుదుర్చుకున్న ఒప్పందాన్ని కార్మికులపై బలవంతంగా రుద్దితే సహించేది లేదని తెలిపారు. యాజమాన్యం మిల్లును వెంటనే తెరిచి నడపాలనిడిమాండ్ చేస్తూ ఉత్పత్తికి సహకరిస్తామని అదే సమయంలో యాజమాన్యం ఏకపక్షంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన తెలిపారు.