వచ్చే ఏడాది జనవరి 3 రాష్ట్రంలో ని విజయనగరం కలెక్టరేట్ వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఆవిష్కరణ ఉంటుందని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల తెలిపారు. కలెక్టరేట్ సమీపంలోని మహాత్మా జ్యోతిభా ఫూలే విగ్రహం ప్రక్కన, జనవరి 3న సావిత్రీభాయి ఫూలే విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు, డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రకటించారు. ఈ మేరకు విగ్రహం ఏర్పాటు పనులను డిప్యూటీ స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల మీడియాతో మాట్లాడుతూ, దశలవారీగా నగరంలో అన్ని జంక్షన్లనూ అభివృద్ది చేస్తామని తెలిపారు. కలెక్టరేట్ వద్ద జ్యోతిభా ఫూలే విగ్రహం ఉన్న ప్రాంతాన్ని ఫూలే జంక్షన్గా, బాలాజీ జంక్షన్కు అంబేద్కర్ జంక్షన్గా నామకరణం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా, వారి త్యాగాలను ప్రజలు నిరంతరం స్మరించుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఫూలే జంక్షన్ను కూడా సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇప్పటికే నగరంలో చాలా కూడళ్లను అభివృద్ది చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర సీఎం జగన్ ఆదేశాలకు అనుగుణంగా, ప్రజల సహకారంతో పట్టణంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను అందరూ గమనిస్తున్నారని అన్నారు. ఇటీవల అమ్మవారి పండుగకు వచ్చిన లక్షలాది మంది జనం, పట్టణంలో జరుగుతున్న అభివృద్దిని చూసి, అభినందనలు తెలిపారని చెప్పారు.
ఒకవైపు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే, అభివృద్ది కార్యక్రమాలకూ తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కోలగట్ల స్పష్టం చేశారు. పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించేందుకు 200 కనక్షన్లను, 6,000 కొళాయి కనక్షన్లను కూడా మంజూరు చేస్తున్నామని చెప్పారు. తమ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే, స్థానిక నాయకుల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్, కార్పొరేటర్లు పట్నాన పైడిరాజు, పిన్నింటి కళావతి, సుంకరి నారాయణస్వామి, పార్టీ జోనల్ ఇన్ఛార్జి డాక్టర్ విఎస్ ప్రసాద్, దూబే, థమ్ము, పార్టీ నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.