జనసేన పార్టీ బీజేపీతో జతకట్టడాన్ని ప్రముఖ మత ప్రబోధకుడు, ప్రశా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కే ఏ పాల్ తీవ్రంగా వ్యతిరేకించారు. మత తత్వ బిజెపితో జనసేన కలిసి పని చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని ఆయన అన్నారు. అమెరికాలో ఉండి ప్రపంచ శాంతి కోసం ప్రయత్నిస్తున్న పాల్ ఫేస్ బుక్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో లైవ్ లో మాట్లాడారు.
తన కృషివల్ల ప్రపంచ యుద్ధం దాదాపుగా ఆగిపోయిందని, ఆ పనుల్లో బిజీ గా ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ గురించి ఇన్ని రోజులూ మాట్లాడలేకపోయానని పాల్ అన్నారు. జనసేన బిజెపి కలిసిపోయాయని తెలిసిన తర్వాత ఉండబట్టలేక తాను మాట్లాడుతున్నట్లు పాల్ తెలిపారు. అందరూ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిన సమయంలో పవన్ కల్యాణ్ అనే డ్యాన్సులు వేసుకునే వాడు ఈ విధంగా మతతత్వ పార్టీతో కలవడం వల్ల ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు.
పవన్ కల్యాణ్ రాజకీయాలు మానేసి డ్యాన్సులు చేసుకుంటే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపిలో బిజెపికి ఒక్క శాతం ఓట్లు ఉన్నాయని, పవన్ కల్యాణ్ మరి ఇంత కాలం ఆయనతో కలిసి ఉన్న బిఎస్పి లాంటి పార్టీలకు కేవలం ఐదు శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయని బిజెపి పవన్ కల్యాణ్ లు కలవడం వల్ల కేవలం ఆరు శాతం ఓట్లు మాత్రమే వస్తాయని పాల్ విశ్లేషించారు. అంతే తప్ప అధికారంలోకి వారు రావడం కల్ల అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి తాను పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు పాల్ తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి తనను కోరితే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువస్తానని పాల్ ఆఫర్ ఇచ్చారు.