కడప నగరపాలక సంస్థ ప్రజల మీద విపరీతమైన భారాలు వేస్తూ కలెక్షన్ ఏజెంట్ కార్యాలయంగా మారిపోయిందని సిపిఎం కడప నగర కార్యదర్శి ఏ రామమోహన్ ఆదివారం మీడియా సమావేశంలో తెలిపారు. కడప నగర ప్రజల మీద భారాలు మోపడమే పనిగా అధికార యంత్రాంగం పని చేస్తోందన్నారు. ఇటీవల కాలంలో ఆక్యుపెన్సి సర్టిఫికెట్, తదితరాల పేరుతో నగరంలో దాదాపు 7వేల మందికి పైగా నోటీసులు అందజేశారని ఆయన తెలిపారు.
గత కొద్ది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పన్నులు సక్రమంగా చెల్లించలేదనే సాకుతో కడప నగర సామాన్య, మధ్యతరగతి ప్రజానీకాన్ని ఇబ్బందులు పాలు చేయటం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలోని ఇతర నగరాల లాగా కడప నగరం సమగ్రంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. నగర ప్రజానీకం పన్నులు చెల్లిస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలం అయ్యారని అన్నారు.
కడప నగరానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా నగరంలో చేసే ఖర్చు కడప నగర ప్రజలే భరించాలనే ఆలోచనతో భారాలు మోపుతోందన్నారు. భవన నిర్మాణదారులు నిర్మించుకున్న కట్టడానికి సీనరేజ్ తదితర రకరకాల పన్నులు చెల్లిస్తున్నప్పటికీ సౌకర్యాల కల్పనలో సరైన శ్రద్ధ లేదని ఆయన అన్నారు. నగరపాలక యంత్రాంగం నోటీసులు ఇవ్వడం, వాటి మీద వివరణ కోరడం, ఆ తర్వాత పన్నులు వేయడం, బెదిరింపులకు పాల్పడడం జరుగుతోందని, ఇలాంటి పద్ధతులకు నగరపాలక యంత్రాంగం తక్షణమే స్వస్తి పలకాలని ఆయన డిమాండ్ చేశారు.
కడప నగర శివారు ప్రాంతాలైన తిలక్ నగర్ ఆర్కె నగర్ మృత్యుంజయకుంట ఉత్తరాస్పల్లె తదితర ప్రాంతాల్లో రోడ్లు చాలా అద్వానంగా ఉన్నాయని వాటి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధుల కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. పన్నుల పేరుతో ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు మోపి ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసే చర్యలకు ముగింపు పలకాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు చంద్ర రెడ్డి నగర కమిటీ సభ్యులు పరుక్ హుస్సేన్, ఓబులేసు పాల్గొన్నారు.