సమయస్ఫూర్తితో వ్యవహరించి గుర్తుతెలియని మృతదేహం ఆచూకీ తెలుసుకునేలా చేసిన మహిళా పోలీసును, వాట్సాప్ లో చూసి గుర్తుపట్టి తన వంతు బాధ్యతగా పోలీసులకు సమాచారమిచ్చిన పంచాయతీ ఉద్యోగిని కడప జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ అభినందించి నగదు రివార్డులు అందచేశారు.
మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో లక్కిరెడ్డిపల్లె మహిళా పోలీసు బి.సుకన్య, అక్కడి పంచాయతీ ఉద్యోగి ఎం.హరిప్రసాద్ ను జిల్లా ఎస్.పి రివార్డులందచేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తక్షణం స్పందించి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం, వెంటనే ఫోటో ను పంచాయతీ ఉద్యోగి గుర్తించడం, బంధువులకు, పోలీసులకు సమాచారమివ్వడం అభినందనీయమన్నారు.
మహిళా పోలీసు సుకన్య అందరికీ స్ఫూర్తి దాయకంగా నిలిచారని ఎస్.పి పేర్కొన్నారు. సోమవారం లక్కిరెడ్డిపల్లె మండల కేద్రంలోని ఫైర్ స్టేషన్ వద్ద ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకొని మృతదేహం ఫోటో ను మహిళా పోలీసు సుకన్య మహిళా పోలీస్ గ్రూప్ తో పాటు వాలంటీర్ ల గ్రూప్ లో చేశారు.
మృతదేహం రామాపురం మండలం దూదేకులవాండ్ల పల్లె కు చెందిన చిన్న నరసింహులు గా గుర్తించారు. బంధువులకు అప్పగించారు. ఈ నేపధ్యం లో విధుల్లోమంచి పనితీరు కనబరచిన సుకన్య, హరి ప్రసాద్ లను అభినందించారు. కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లె ఎస్.ఐ వినోద్ కుమార్ పాల్గొన్నారు.