క్రైస్తవ పాలకుల మెప్పు కోసం హిందూ జీవన విధానంపై దాడి చేయడం ఏపి మంత్రి కొడాలి నానికి తగదని తెలుగు మహిళ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు.
పదవి కాపాడుకోవడానికి హిందూ దేవుళ్లను కించపరుస్తూ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల్ని ఆమె తీవ్రంగా ఖండించారు. తిరుమల డిక్లరేషన్ ఎవరిని అడిగి పెట్టారు అని ప్రశ్నించడం మంత్రి కొడాలి నాని అవివేకానికి నిదర్శనమని ఆమె అన్నారు.
కొడాలి నానిని, క్రైస్తవ పాలకులను అడిగి పెట్టాలా అని కాట్రగడ్డ ప్రసూన ప్రశ్నించారు. స్వచ్ఛంగా సాగాల్సిన పాలనలోకి కులాలు తీసుకువచ్చిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు హిందూ మతంపై దాడి ప్రారంభించిందని ఆమె అన్నారు.
హిందూ మతం అనేది ఒక జీవన విధానమనే విషయాన్ని మర్చిపోయి విమర్శిస్తున్నారని కాట్రగడ్డ ప్రసూన అన్నారు. ఆంజనేయుడి చేయి విరగ్గొడిగే ఏమౌతుంది?, రథం తగలబెడితే ఏమౌతుంది? సింహాలు మాయం అయితే ఏమౌతుంది? అంటూ క్రైస్తవ పాలకుల మదిలోని మాటను ప్రశ్నల రూపంలో సంధిస్తున్న కొడాలినాని హైందవ జాతికి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
మంత్రిగా ఉండి మతాలను కించపరుస్తూ మాట్లాడిన కొడాలి నానిని మంత్రివర్గం నుంచి రాష్ట్ర గవర్నర్ బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇంత కాలం కమ్మ కులాన్ని కించపరుస్తూ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తుంటే వేరే కులాల వారు మాట్లాడలేదని, ఇప్పుడు హిందూ మతాన్ని విధ్వంసం చేసేందుకు నడుం బిగించారని ఆమె అన్నారు.
ఇప్పటికైనా కులాలకు అతీతంగా ప్రజలు సంఘటితం కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో హిందువుల మనుగడే ప్రశ్నర్ధకమౌతుందని కాట్రగడ్డ ప్రసూన అన్నారు.