తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు పై తప్పుడు కేసులు బనాయించి ప్రజల సొమ్మును దుబారా చేయడం తప్ప ఈ 15 నెలల కాలంలో వైసీపీ ప్రభుత్వం సాధించిందేంటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు ప్రశ్నించారు.
ప్రజా వ్యతిరేక విధానాల నుంచి, తాము చేసే అవినీతి గురించి కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ ప్రభుత్వం రోజుకో అంశాన్ని తెరపైకి తెస్తున్నదని ఆయన అన్నారు. హవాలా వ్యవహారంలో వైసీపీ మంత్రి బాలినేని పేరు బయటకు వచ్చినప్పుడు అచ్చెన్నాయుడిపై అక్రమంగా కేసు పెట్టారని ఇప్పుడు వై.ఎస్. కుటుంబంపై సిబిఐ విచారణను దృష్టి మళ్లించడానికి మరొక తప్పుడు కేసు పెట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజాస్వామిక వ్యవస్థలపై ప్రణాళికబద్ధమైన దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కుట్రకు తాడేపల్లే ప్రధాన కేంద్రంగా మారిందని ఆయన అన్నారు. తాడేపల్లి లో ఉన్నది వైసీపీ కేంద్ర కార్యాలయం కాదు, కుట్రలకు కేంద్రాలయం. రాష్ట్రంలో జరుగుతున్న ఘటన లన్నీ ఇక్కడ స్క్రిప్టు ప్రకారమే జరుగుతున్నాయి అని ఆయన నిశితంగా విమర్శించారు.