సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని అతి పురాతనమైన స్వయంభు శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం(అమావాస్య రోజున) అమ్మవారిని పసుపుతో అలంకరించారు. కొలిచిన వెంటనే కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కనకదుర్గ అమ్మవారి కోవెలలో ఆదివారం బ్రాహ్మీ ముహూర్త సమయంలో పంచామృతాలతో, పంచసూక్త వేద మంత్రాలతో శాస్త్రోప్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం శుభ సూచికమైన పసుపుతో,నూతన పట్టు వస్త్రాలతో కనకదుర్గ అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి, షోడశోపచారాలు నిర్వహించారు.
ప్రదోషకాల సమయంలో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం భక్త మహిళలు పారాయణం చేశారు. అర్చకులు నరగిరినాధుని రంగ భట్రాచార్యులు సహస్రనామ కుంకుమార్చన గావించి, గుడిసేవ,ధూప,దీప నైవేద్య,మంగళ నీరాజన మహా మంత్రపుష్పం సమర్పించి,సంతాన భాగ్యం కోరకు అమ్మవారి ప్రతిమను అందజేసి, తీర్ధ,ప్రసాద వితరణ చేశారు.
ఈనెల 26వ,తేదీ నుండి అక్టోబర్ 5వ,తేది వరకు(శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు) శ్రీ కనకదుర్గ అమ్మవారి కోవెలలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని,వేద మూర్తులు పోతావఝ్ఝుల ఫాల్గుణ శర్మ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రతి రోజు మహాన్యాస పూర్వక,నమక,చమక, పంచసూక్తలతో రుద్రాభిషేకం జరుగుతుందని,అక్టోబర్ 2న,మూల నక్షత్రము సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసం జరుగుతుందని అర్చకులు నల్లూరి పురుషోత్తమా చార్యులు, నరగిరినాధుని రాఘవాచార్యులు,ఏడిద నర్సింహా చార్యులు,శ్రీ దత్తవిష్ణు తెలిపారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్