విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని ఉత్తరాంధ్ర ప్రాంత ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 22 వ జాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఈ జాతర మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. ఏటా శివరాత్రి తరువాత వచ్చే ఆదివారం ప్రారంభమై మూడు రోజుల పాటు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
పట్టణ శివారున విశాల ప్రాంగణంలో అమ్మవారి దేవస్థానం ఉండటంతో పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తుంటారు. ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటలకు విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ అమ్మవారిని అలంకరించి, మొదటి పూజను ప్రారంభించారు. జాతర సందర్భంగా చీపురుపల్లి పట్టణంలో నూతన శోభ సంతరించుకుంది.
విద్యుత్తు దీపాల అలంకరణతో పట్టణం మెరిసిపోయేలా చేశారు. ప్రధాన రహదారులను శోభాయమానంగా తీర్చదిద్దారు. అమ్మవారి దేవస్థానం నుంచి శ్రీకాకుళం రహదారి మీదుగా మూడు రహదారుల కూడలి, విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారుల పొడుగునా విద్యుత్తు దీపాలతో అలంకరించారు.
భారీ సెట్టింగులను ఏర్పాటు చేశారు. జాతరలో భాగంగా రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి మహిళా ఆహ్వానపు కబడ్డీ పోటీలను కమిటీ వారు ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు లక్షల్లో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించి, జాతరను తిలకించనున్నారని అంచనా. ఏపీ, తెలంగాణ, ఒడిశాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాల రీత్యా వెళ్లిన వారంతా విధిగా హాజరవుతుంటారు.
మనీష్, రిపోర్టర్, మెట్రో టీవీ, చీపురుపల్లి, విజయనగరం