సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణను పల్నాడు జిల్లా సత్తెనపల్లి టిడిపి ఇన్ఛార్జ్గా నియమిస్తూ టిడిపి ప్రకటించింది. బిజెపి నుంచి టిడిపిలో చేరిన కన్నాను నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమిస్తూ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం తో ఒక్కసారిగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో సంచలనం రేకెత్తించింది. అంతకు ముందు దాదాపు నాలుగేళ్ల పాటు నియోజకవర్గంలో టిడిపికి ఇన్ఛార్జ్ లేరు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి కోడెల శివప్రసాద్రావు పోటీ చేసి వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబుపై ఓడిపోయారు.
అనంతరకాలంలో వైకాపా ప్రభుత్వం ఆయనను తీవ్రంగా వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మరణం తరువాత ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జి పదవి కోసం పలువురు పోటీపడ్డారు. కోడెలతనయుడు కోడెల శివరామ్తో పాటు, మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు, శివనాగమల్లేశ్వరరావు, శౌరయ్య తదితర నేతలు రంగంలోకి వచ్చారు. అయితే..టిడిపి అధినేత ‘కన్నా’ను ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించి నియోజకవర్గంలో వర్గ రాజకీయాలకు చెక్ పెట్టారు. టిడిపికి గట్టి పట్టున్న ఈ నియోజకవర్గంలో ఇంతకాలం టిడిపికి నాయకత్వ సమస్య వేధించింది.
కోడెల కుటుంబంపై జరిగిన దుష్ప్రచారం టిడిపికి కోలుకోలేని నష్టాన్ని కలిగించింది. టిడిపి గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను అధినేత ప్రకటిస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగా, కాపు సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత ‘కన్నా’ను బరిలోకి దింపి వైకాపాకు సవాల్ విసిరారు. చీటికి మాటికి టిడిపి అధినేతను దూషిస్తోన్న మంత్రి అంబటి రాంబాబు ఓటమే ధ్యేయంగా ‘చంద్రబాబు’ బలమైన ‘కన్నా’ను ఇన్ఛార్జిగా ప్రకటించారని ప్రచారం సాగుతోంది. మొత్తం మీద అధినేత చాలా లేటుగా ‘సత్తెనపల్లి’పై నిర్ణయం తీసుకున్నా సరైన నిర్ణయం తీసుకున్నారనే మాట పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.