ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోమని కరణం అంబికా క్రిష్ణ అన్నారు.
చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసిపి రౌడీ మూకలు దాడి చేస్తే వారిని పరామర్శించాటానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ను రేణిగుంట విమానాశ్రయం లో పోలీసులు అడ్డుకోవటం ఏమిటి అని ఆమె ప్రశ్నించారు.
43 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా 12 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా 70 సంవత్సరాల వయసు కలిగిన నాయకుడిని అవమానిస్తారా అని ఆమె ప్రశ్నించారు. ప్రపంచం మెచ్చిన నాయకుడు ప్రజల కోసం నేల మీద కూర్చున్నందుకు వైసిపి నాయకులకు రాక్షస ఆనందం పొందారేమో కాని అలాంటి నాయకుడు వున్నందుకు తెలుగుజాతి గర్వపడుతుంది అని ఆమె అన్నారు.
ప్రజల కోసం ఎన్ని కష్టాలైనా పడటానికి చంద్రబాబునాయుడు, ఆయనతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధం అని ఆమె తెలిపారు. తెలుగుదేశం పార్టీ లో శాసన సభ్యులుగా గెలిచి ఇటీవల వైసిపి లో చేరిన కరణం బలరాం నియోజకవర్గం చీరాలలోని ప్రతి తెలుగుదేశం కార్యకర్తను మేము కాపాడు కొంటామని చీరాల గడ్డపై పసుపు జెండా ఎగరేస్తాం అని ఆమె అన్నారు.
తమ అధినేత అనుమతిస్తే చీరాల నియోజకవర్గం మొత్తం గడప గడపకు తిరగటానికి సిద్ధం అని అంబిక తెలియచేసారు. తండ్రి వైసిపి లో చేరినా తాను మాత్రం రాజకీయంగా తండ్రి తో విభేదించి చంద్రబాబు చేసిన అభివృద్ధి, ముందు తరాల కోసం వారు పడే తపన వారి ఆలోచనా విధానాలు నచ్చి వారి వెంటనే వుంటానని ఆమె తెలిపారు.
ప్రజలు మళ్లీ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టటం ఖాయం అని ఆమె ధీమా వ్యక్తం చేసారు. ఆంధ్రరాష్ట్రం లో ప్రతి కార్యకర్త ని కాపాడు కోవటానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా నిరంతరం గ్రామాలలో పర్యటించి వారికి అండగా వుంటున్నారని ఆమె అన్నారు. రాబోయే ఎన్నికలలో యువతే ప్రధాన పాత్ర పోషిస్తుంది అని ఆమె తెలిపారు.