సైదాపూర్ మండలంలోని లసమన్నపల్లి గ్రామ సర్పంచ్ కాయిత రాములును కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక్ బుధవారం సన్మానించారు. జమ్మికుంట పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో జరిగిన జాతీయ రైతు దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ విచ్చేశారు.
ఈ సందర్భంగా కెవికె ఆధ్వర్యంలో లసమన్నపల్లి గ్రామంలో ఎస్సీ సబ్ప్లాన్ విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను జిల్లా కలెక్టర్ సర్పంచ్ ను కండువాతో సత్కరించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ దిక్సూచిని అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కెవికె ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను లసమన్నపల్లి గ్రామంలో విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమన్నారు.
మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి గ్రామస్తులు ఆర్థికంగా ఎదిగేందుకు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కెవికె కార్యదర్శి విజయ్ గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, సీనియర్ సైంటిస్ట్ వెంకటేశ్వరరావు, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, సైంటిస్టులు ప్రభాకర్, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.