సామూహిక అత్యాచారార నేరానికి పాల్పడ్డ వారికి మరణ శిక్ష విధించేలా భారతీయ శిక్షాస్మృతికి అవసరమైన మార్పులు చేయాలని కర్నాటక హైకోర్టు అభిప్రాయపడింది. సామూహిక అత్యాచారం అనే నేరం సమాజంలో అతి భయంకరమైన నేరమని జస్టిస్ బి వీరప్ప, జస్టిస్ కె నటరాజన్ అన్నారు.
నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీకి చెందిన ఒక యువతిపై అతి కిరాతకంగా సామూహిక అత్యాచారం జరిపిన ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును కర్నాటక హైకోర్టు ఖరారు చేసింది. ఈ ఏడుగురికి అంతకన్నా పెద్ద శిక్ష వేయాల్సి ఉందని అందుకే భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 డి ని సవరించి మరణశిక్ష విధించేలా మార్పు చేయాలని న్యాయమూర్తులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
బ్రిటీష్ వారి కాలంలో అంటే 1860లో వచ్చిన ఈ చట్టం కారణంగా 74 ఏళ్ల స్వాతంత్ర్యం అనంతరం కూడా మనుషుల్లో మార్పు రాలేదని అందువల్ల ఇంకా వేచి చూడటం కన్నా మరణశిక్ష విధించడం మేలని వారు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు చట్ట సభలు చర్యలు తీసుకోవాలని తాము సిఫార్సు చేస్తున్నట్లు న్యాయమూర్తులు తెలిపారు. సామూహిక అత్యాచారాల కారణంగా మహిళలు పని చేసేందుకు వెళ్లాలంటేనే భయపడుతున్నారని ఇది సమాజానికి మంచిది కాదని వారు అన్నారు.