ఒక వైపు కరోనా విజృంభిస్తుంటే రాజకీయ పార్టీలు మాత్రం రాజకీయాలే ప్రధానమనే రకంగా ప్రవర్తిస్తున్నాయి. ఎన్నికల ప్రచారాలు, బహిరంగ సభలు, సామూహికంగా లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలు అందచేయడం లాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాయి.
ఇలాంటి అన్ని కార్యక్రమాలకు ఆయా రాజకీయ పార్టీలే బాధ్యత వహించాలని కర్నాటక హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఎం), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్), కన్నడ చలువాలి వతల్ పక్ష లకు కర్నాటక హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
కార్యక్రమ నిర్వాహకులు మాస్కులు ధరించే విధంగా, భౌతిక దూరం పాటించే విధంగా రాజకీయ పార్టీలే బాధ్యత వహించాలని నోటీసులో పేర్కొన్నారు. డిసెంబర్ 4వ తేదీ లోపు ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలూ సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రాజకీయ పార్టీలు నిర్వహిస్తున్న బహిరంగ కార్యక్రమాలలో కరోనా నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ లెటజ్ కిట్ ఫౌండేషన్ పిటీషన్ దాఖలు చేసింది.