గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం కాశిపాడు హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. డబ్బుల కోసం ఒకడు వచ్చి పరిస్థితి గమనించి హత్య చేసి నగలతో పరారైనట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మల్లెల గోపికృష్ణ అనే వ్యక్తి ఈ దుర్మార్గానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
నిందితుడు చోరీ చేసేందుకు పచారీ షాపు యజమాని రాధాకృష్ణ ఇంటికి వచ్చాడు. నిందితుడును గమనించిన రాధాకృష్ణ అతని భార్య నరసమ్మ ఇక్కడ ఏమి పని అని ప్రశ్నించారు. ఇంటిలో ఉన్న బంగారు ఆభరణాలు ఇవ్వవలసిందిగా నిందితుడు బెదిరించాడు.
దంపతులు కేకలు వేసేందుకు సిద్దపడగా తన దగ్గర ఉన్న కొడవలితో ఇద్దరి పై దాడిచేశాడు. దాంతో రాధాకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య నరసమ్మ రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. ఇద్దరూ చనిపోయారని భావించిన నిందితుడు గోపీకృష్ణ ఇంటిలో ఉన్న బంగారు నగలను దొంగిలించాడు.
తెల్లవారు జామున సృహలోకి వచ్చిన హతుని భార్య నరసమ్మ విషయం బంధువులకు ఫోను ద్వారా తెలిపింది. నిందితుడు గోపీని అరెస్టు చేసి విచారించగా నేరం అంగీకరించాడు. బంగారు ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు. వాటి విలుల రూ.6 లక్షలు ఉంటుందని రూరల్ ఎస్పీ విజయారావు తెలిపారు.