హైదరాబాద్ లోని సైదాబాద్కు చెందిన ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార, హత్య సంఘటన అత్యంత బాధాకరం, ఇలాంటి సంఘటనలకు పాల్పడే వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకొని, కఠిన శిక్ష విధించాలని తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు. సిగ్గులేని ఈ సమాజంలో నువ్వు పుట్టినందుకు మాకే బాధగా ఉంది తల్లి …..! అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేరానికి పాల్పడిన వ్యక్తి గంజాయికి బానిసగా మారి ఈ దుర్ఘటనకు పాల్పడినట్లు సమాచారం తెలుస్తున్నదని ఆమె అన్నారు. ఈరోజు హైదరాబాద్ మహా నగరం ఎందుకు మాదకద్రవ్యాలకు, డ్రగ్స్ అడ్డాగా మారిందని ఆమె ప్రశ్నించారు. నార్కోటిక్స్ & పోలీస్ డిపార్ట్మెంట్స్ అసలు ఏం చేస్తున్నాయి ? ఈరోజు ఏ గల్లీకి, బస్తీకి పోయినా మాదక ద్రవ్యాలు ఎందుకు అమ్ముతున్నారు? అలాగే ప్రతి పబ్బులో మాదకద్రవ్యాల అమ్మకాలు ఎందుకు అందుబాటులో ఉంటున్నాయి? అని ఆమె ప్రశ్నించారు.
న్యాయస్థానాలు తక్షణం స్పందించి ఇటువంటి వ్యక్తులను బహిరంగంగా ఉరి తీసే చట్టాలను తేవాలి ..దోషులని వెంటనే ఉరి తీయాలి అప్పుడే ఈ సమాజంలో మహిళలకు చిన్నారులకు న్యాయం జరుగుతుంది అని కాట్రగడ్డ ప్రసూన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఇప్పటివరకు నిందితుని పట్టుకోవడం లో విఫలం అయ్యారని, లక్షల మంది పోలీసులు ఉండి కూడా నిందితుడిని పట్టుకున్న వారికి పది లక్షలు అంటూ పత్రిక ప్రకటన చేయడం వారి చేతగాని తననికి నిదర్శనం అని దుయ్యబట్టారు.