స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు ఎక్కువ పెట్టి ప్రజలను మరొక్కమారు మోసం చేయాలని చూసిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ సారి గట్టిగా బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, తెలుగు మహిళ నాయకురాలు కాట్రగడ్డ ప్రసూన కోరారు.
ఒక్క అవకాశం అంటూ వచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి 9 నెలల పాలనలో రాష్ట్రం 90 ఏళ్ల వెనక్కి వెళ్లిందని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతిని తిరోగమన దిశగా వై ఎస్ జగన్ తీసుకువెళ్లారని ఆమె అన్నారు.
అధికార బలంతో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలలో జగన్ పార్టీ గెలిచేందుకు ప్రయత్నిస్తుందని అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాట్రగడ్డ ప్రసూన అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే మూడు ప్రాంతాల ప్రజలను మోసం చేసేందుకు మూడు రాజధానుల గేమ్ ప్లన్ మొదలు పెట్టిన జగన్ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకారి అని ఆమె అన్నారు.
అమరావతిలో రైతులు అలో లక్ష్మణా అంటూ గోలపెడుతుంటే కనీసం చూడను కూడా చూడటం లేదని ఇదేం ప్రభుత్వమని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు విశాఖపట్నం ప్రాంతంలో రైతులు గగ్గోలు పెడుతున్నారని ఆమె అన్నారు. కోస్తా ఆంధ్రలో చిచ్చు పెట్టి ఇప్పుడు ఉత్తర ఆంధ్రాలో గుండె మంటలు రగిలించారని, రాబోయేది రాయలసీమ వంతు అని కాట్రగడ్డ ప్రసూన అన్నారు.
అందువల్ల మూడు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక సంస్థల ఎన్నికలలో జగన్ పార్టీని దూరంగా ఉంచాలని ఆమె కోరారు.