అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైన తెలంగాణ నూతన సచివాలయంలో సాహిత్య సృజన సైతం జరిగింది. ప్రముఖ రచయిత గంగాడి సుధీర్ రాబోయే కవితా సంకలనం ‘కవనం’ కవర్ డిజైన్ని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తన కుటుంబ సభ్యుల సమక్షంలో తన చాంబర్లో ఆవిష్కరించారు. మంచి రచనలు చేసే సుధీర్ త్వరలో విడుదల చేసే నూతన కవితా సంపుటి ‘కవనం’ గత పుస్తకం ‘ఇగురం’ వలె మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా రచయిత సుధీర్ మాట్లాడుతూ త్వరలో వెలువరించనున్న కవితా సంపుటి ‘కవనం’ కవర్ పేజీని ఆవిష్కరించిన మంత్రి గంగులకు, నూతన సచివాలయంలో ఆవిష్కరణ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. అతి త్వరలో ఈ సంపుటిని సిరిసిల్లలో ఆత్మీయుల మధ్య ఆవిష్కరించబోతున్నానని తెలియజేశారు. గత కథల పుస్తకం ఇగురం ను ఆదరించిన మాదిరే ఈ కవితా సంపుటీ ‘కవనం’ ని ఆహ్వానిస్తారని ఆశాభవం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సాహిత్య అభిమానులు పాల్గొన్నారు.