వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రతీ ఏటా 100 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తానని కేసీఆర్ మాట తప్పాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. తాగు నీటి సమస్యను కూడా తీర్చలేకపోయాడు. 2018లో చెన్నమనేని రమేష్ ఒడిపోతాడనే భయంతో సూరమ్మ ప్రాజెక్ట్ కు శిలాఫలకం వేశారు. 43 వేల100 ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచారు. ఇన్నేళ్లయినా తట్ట మట్టి కూడా తీయలేదు. ఈ ప్రాంతంపై కేసీఆర్ వివక్ష చూపుతున్నారు అని రేవంత్ రెడ్డి అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన వివక్షనే.. కేసీఆర్ పాలనలో కొనసాగుతోందని ఆయన అన్నారు. 40 ఏళ్ల కింద తనకు ఇక్కడే తనకు పెళ్లి జరిగిందని… ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని కేసీఆర్ చెప్పిండు. 40 ఏళ్ల కింద కేసీఆర్ కు ఇక్కడ లగ్గం అయిందో లేదో తెలియదుకానీ… వేములవాడ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆయన లగ్గం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. గుడిని, గుడిలో లింగాన్ని దిగమింగే ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతోందని ఆయన అన్నారు. వేములవాడ ఎమ్మెల్యేను కలవాలంటే జర్మనీకి పోవాల్సిన ఖర్మ పట్టింది.
ఈ ప్రజలపై ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు ప్రేమ లేదు. అందుకే ఇక్కడి పౌరసత్వం వదులుకున్నారు. ప్రజలతో బంధం తెంచుకున్నారు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ తెచ్చిన అన్న వారికి రెండుసార్లు అవకాశం ఇచ్చారు.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. ఒక్క అవకాశం ఇస్తే… ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 5లక్షలు సాయం అందిస్తాం.
రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం. ప్రతీ పేద రైతులు రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటాం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. ప్రతీ పేద ఆడబిడ్డకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. సూరమ్మ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేసి 43వేల ఎకరాలకు నీరందిస్తాం. గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఆదుకుంటాం అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.