ఉగ్రవాదం పై పాకిస్తాన్ నీతులు చెప్పినట్లు అవినీతిపై కేసీఆర్ నీతులు చెబుతున్నాడని బీజీపీ ఏపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణాలో బీజేపీ పెరుగుదలను చూసిన సీఎం కేసీఆర్ లో వణుకు పుట్టిందని అందుకే బీజేపీ పై క్రమం తప్పకుండా విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఒక్కసారి అధికారం నుండి బయటకి వస్తే తాను చేసిన మోసాలన్నీ పట్టుబడతాయనే భయంతో కేసీఆర్ ఉన్నారని, తాను చేసిన అవినీతి బయటపడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయం కేసీఆర్ ను వెంటాడుతున్నదని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.
కేసీఆర్ సర్జికల్ స్ట్రైక్ గురించి ప్రశ్నిస్తున్నారని పాకిస్తాన్ మంత్రి కూడా దానిని అంగీకరించారు, కానీ మీరు దానిని జీర్ణించుకోలేకపోతున్నారు అని విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సర్జికల్ స్ట్రైక్ అనేది భారత సైన్యానికి సంబంధించిన విషయమని, బీజేపీకి సంబంధించినది కాదని ఆయన గుర్తుంచుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. భారత సైన్యాన్ని కించపరిస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
ప్రధాని మోదీపై కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయని కేసీఆర్ చెబుతున్నారు… అవినీతిలో మునిగిపోయిన కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడటం చూసి నవ్వుకోవాల్సి వస్తున్నదని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. దాదాపు 8 సంవత్సరాలు అయినా ఏ ప్రతిపక్ష పార్టీ కూడా ఒక్క అవినీతిని కూడా రుజువు చేయలేదు. రాఫెల్ డీల్లో కూడా, మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టు నుండి క్లీన్ చిట్ పొందిందని ఆయన గుర్తు చేశారు.
ప్రధాని మోడీపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు, కేసీఆర్ కొత్త బాస్ రాహుల్ గాంధీ తో కలిసి క్షమాపణలు చెప్పవలసివస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. భారత్, అమెరికా సంబంధాల గురించి మాట్లాడినట్లయితే, ఇది గతంలో కంటే మరింత బలపడిందని ఆయన తెలిపారు. ద్వైపాక్షిక సహకారం విస్తృత ఆధారిత, బహుళ రంగాల, వాణిజ్యం & పెట్టుబడులు, రక్షణ మరియు భద్రత, విద్య, సైన్స్ మరియు టెక్నాలజీ ఇలా చాలా వరకు అమెరికాతో మంచి సంబంధాలు ఉన్నాయని, దాని గురించి కేసీఆర్ లాంటి వ్యక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.