తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డిఎస్పీ స్థాయి ఉద్యోగాన్ని త్యాగం చేసింది నళిని. కేసిఆర్ ఆమరణ నిరాహార చేస్తున్న టైమ్ లో ఆవేశంతో ఏమీ తోచని యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
అలాంటి యువతపై సమైక్య పాలకులు లాఠీ లు ఝుళిపిస్తున్నారు. అలాంటి ఉద్యమకారులకు ధైర్యమిచ్చేలా నళిని తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఉద్యమంలో చేరారు నళిని.
తెలంగాణ వచ్చాక అనేక విజయోత్సవ సభలు, సన్మానాలు, ప్రశంసలు, నగదు రూపేణ ఆర్థిక సహాయాలు, కొమ్రంభీం మనుమరాలి నుండి కళాకారుల వరకు ఉద్యోగాలిచ్చిన ప్రస్తుత ప్రభుత్వం నళిని త్యాగాన్నెందుకు మర్చిపోయిందో అర్దం కావట్లేదు.
రెండు సార్లు త్యాగం చేసిన అక్క
తెలంగాణ కోసం రెండు సార్లు ఉద్యోగానికి రాజీనామా చేశారు నళిని. తెలంగాణ కోసం వారం రోజులు ఢిల్లీలో నిరాహార దీక్ష చేసి తనూ మృత్యుముఖాన్ని దాదాపు తాకొచ్చిందామె.
తెలంగాణ జేఏసి ఏర్పడక ముందే, ఉద్యోగులందరూ పూర్తి స్థాయిలో ఉద్యమంలో దిగక ముందే, అన్ని పార్టీలు తెలంగాణ ఏర్పాటుపై వాటి స్టాండ్ ని ప్రకటించక ముందే నళిని చేసిన త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించలేదు.
మలి విడత తెలంగాణ సమర పోరాటానికి ఆమె రాజీనామానే పునాది. మొదటిసారి ఆమె రాజీనామా చేసినా రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరిగి పోస్టింగ్ ఇచ్చారు.
అయితే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం నళిని కి తిరిగి పోస్ట్ ఇవ్వలేదు. ఆమె కోల్పోయిన సర్వీస్ ను, జీతాన్ని లెక్కించి, పరిగణనలోకి తీసుకొని ప్రమోషన్ కల్పించి ఆమెకు ఉద్యోగమివ్వాలని తెలంగాణ సమాజం కోరుతున్నది.
సిరిగె రమేష్ శర్మ, సీనియర్ జర్నలిస్టు, నిర్మల్