నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నేపధ్యంలో ఏప్రిల్ 14 వ తేదీన నల్గొండ జిల్లా హాలియా లో సీయం కేసీఆర్ తలపెట్టిన భారీ బహిరంగ సభను ప్రజారోగ్యం దృష్ట్యా రద్దుచేయాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమీషన్లో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా రాచాల విలేకరులతో మాట్లాడుతూ కరోనా తీవ్రత దృష్ట్యా ఏప్రిల్ 30వ తేదీ వరకూ ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో యం.యస్ నెం.69ని జారీ చేసిందని, కానీ సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ జీవో 69 ని ఉల్లంఘిస్తూ సభ నిర్వహించడం సరికాదని అన్నారు.
దీనివల్ల ప్రజారోగ్యం మీద తీవ్రమైన ప్రభావం పడుతుందని, అందువల్ల ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 14వ తేదీన నల్గొండ జిల్లా హాలియాలో జరగబోయే సీయం కేసీఆర్ బహిరంగ సభను రద్దుచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరియు రాష్ట్ర డీజీపీకి అదేశాలివ్వాలని కోరారు.
కమిషన్ ను కలిసిన వారిలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు బడేసాబ్, శశికుమార్ గౌడ్ , పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి