పక్క రాష్ట్రాల ప్రజలపై విషం చిమ్మే మీకు జాతీయ రాజకీయాలలోకి వచ్చే అర్హత ఉందా? అని భాజపా ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. ఈ విషయంలో ఆత్మవిమర్శ చేసుకోండి…. ముందు ఏపి ప్రజలకు క్షమాపణ చెప్పండి కేసిఆర్ అని ఆయన డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పాలకులను పాపాత్ములుగా చిత్రీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలపై తెలంగాణ రాష్ట్ర విద్యార్థులలో విద్వేషాన్ని రేకెత్తించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విభజన సమయంలో విద్వేషాలు రగల్చడమే కాకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కేసీఆర్ అదే వైఖరితో ఉన్నారని, అందుకే పాఠ్యాంశంగా ఈ విద్వేషాలను ప్రవేశ పెట్టారని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం నుండి రాష్ట్రాల మద్య విద్వేషాన్ని రేకెత్తించేలా ఉన్న మీ స్వంత రాష్ట్రంలో ఆపాఠాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాను. అప్పుడు మాత్రమే పక్క రాష్ట్రాల్లో పర్యటించే హక్కు ఉంటుందని బిజెపి ఆంధ్రప్రదేశ్ మీకు గుర్తు చేస్తోంది అని ఆయన అన్నారు.