తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ముదిరాజు కులస్తుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్య్సకార సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. సిద్దిపేట జిల్లా పెద్దకోడూర్ లో నేడు మత్య్సకారుల సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు సందిల కరుణాకర్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో మాట్లాడుతూ ఇతర కులాలకు ఇచ్చే ప్రాధ్యాన్యతను ముదిరాజులకు కేసీఆర్ ఇవ్వడం లేదని జంగిటి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ముదిరాజులకు వృత్తిపరమైన సౌకర్యాలు కల్పించాలని, ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 18 సంవత్సరాలు నిండిన ముదిరాజులకు మత్య్సశాఖలో సభ్యత్వం ఇవ్వాలని ఆయన కోరారు.
అదే విధంగా ముదిరాజ్ లకు చట్టసభలల్లో, ఉద్యోగాలలో 10% రిజర్వేషన్ ఇవ్వాలని ఆయన కోరారు. ముదిరాజులకు ప్రతి బడ్జెట్ లో ఐదు వేల కోట్లు కేటాయించి ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో చిన్నకోడూర్ మండల అధ్యక్షుడు తుమ్మల శ్రీనివాస్, కొండపాక మండల కన్వీనర్ కాస రమేష్, నాయకులు తుమ్మల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.