కేబినెట్ సమావేశం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన అంశాలు పూర్తిగా అవాస్తవమని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. కేంద్రంపై కేసీఆర్ చేసిన విమర్శలను మీడియా సమావేశంలో ఆయన తిప్పికొట్టారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే కేంద్రంపై నింద మోపే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం పనిచేస్తుందని వెల్లడించారు. ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ ప్రజా సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్లే రెవెన్యూ వ్యవస్థ చిన్నాభిన్నమైందని లక్ష్మణ్ అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన రవాణా చట్టంపై కేసీఆర్ అవాస్తవాలు మాట్లాడడం మానుకోవాలన్నారు. ఆర్టీసీ విషయంలో బిజెపి ఎంపీలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు.
ఆర్టీసీ సమ్మెను దృష్టిలో పెట్టుకుని ఛార్జీల రూపంలో పేద ప్రజలపై భారం మోపడం కాక ఇంకేటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలి తప్ప ప్రజలపై భారం మోపకూడదని హితవు పలికారు. కార్మిక సంఘాల అవసరం లేదని.. డిపోకు కొంత మంది కార్మికులతో మాట్లాడతానని చెప్పడం అప్రజాస్వామికమన్నారు.