(సత్యం న్యూస్ ప్రత్యేకం)
తెలంగాణ రెవెన్యూ శాఖ లో ఇంత కాలం ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వారికి ఇక నుంచి కష్టాలు తప్పవు. పెత్తనం చెలాయించే వారికి ఇక పని చేయకతప్పని పరిస్థితి రాబోతున్నది.
రెవెన్యూ విభాగంలో అదనంగా ఉన్న దాదాపు 20 వేల మందిని సిబ్బంది లేక సతమతమౌతున్న ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్థిర నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ మేరకు రాబోయే అసెంబ్లీ సమావేశాలలో కూలంకషంగా చర్చించి చట్ట రూపంలోకి తీసుకువచ్చేందుకు ఆయన ఎంతో గుంభనంగా చర్యలు చేపడుతున్నారని తెలిసింది. రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు సంబంధించి నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే నిర్ణయాలు తీసుకుంటున్నారు.
అవినీతి కార్యకలాపాలకు చెక్
ఆయనకు సహాయకుడిగా ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పని చేస్తున్నారు. రెవెన్యూ వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ శాఖలో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు.
ఈ మేరకు అతి త్వరలో తుది నివేదికను ఆయన సిద్ధం చేసుకోబోతున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రెవెన్యూ శాఖ లోని సర్ ప్లస్ స్టాఫ్ ను ఇతర శాఖలకు బదిలీ చేయడం ద్వారా మానవ వనరులను సమర్ధంగా వినియోగించుకోవచ్చునని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు.
పి వి తరహాలో కఠిన నిర్ణయాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సంస్కరణలు తీసుకువచ్చి చిరస్థాయిగా నిలిచిపోయిన మాజీ ప్రధాని, వంగర బిడ్డ పి వి నరసింహారావు స్ఫూర్తితో కేసీఆర్ రెవెన్యూ శాఖ లో మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు.
పి వి భూ సంస్కరణల తరహాలోనే తాను తీసుకురాబోతున్న రెవెన్యూ చట్టంలోని మార్పులు దేశానికే మోడల్ కావాలనే తరహాలో ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలూ అదే పనిమీద ఉన్నారని ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. రెవెన్యూ శాఖపై విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి.
అవినీతి కేసులు మితిమీరి ఉన్నాయి. అవినీతి నిరోధక శాఖ ఎవరిని పట్టుకున్నా వందల కోట్లు దొరుకుతున్నాయి. పెచ్చుమీరిపోయిన అవితీనితో రెవెన్యూ శాఖ అంటేనే ప్రజల్లో అసహ్యం ఏర్పడుతున్నది.
వీటన్నింటిని చెక్ పెట్టేందుకు వీలుగా రెవెన్యూ చట్టంలో మార్పులు ఉండబోతున్నయని తెలిసింది.
రెవెన్యూ శాఖ కు పట్టిన అవినీతి చెదలు వదిలిస్తే ప్రభుత్వానికి కూడా ఎంతో మేలు జరుగడమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది.