అద్భుత మైన ఫలితాలు అందించిన తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మునిసిపల్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అఖండ విజయం సాధించడం ద్వారా తమపై బాధ్యత మరింత పెరిగిందని ఆయన అన్నారు. ఫలితాలు వెలువడిన తక్షణమే ఆయన నేడు మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలని ఆయన అన్నారు.
టిఆర్ఎస్ పార్టీని గుడ్డిగా విమర్శించడం కన్నా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలని కేసీఆర్ అన్నారు. ప్రతిపక్షాలు దారుణమైన విమర్శలు చేశారని, అయితే ప్రజలు మాత్రం విచక్షణతో ఓటు వేశారని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకూ జరిగిన అన్ని ఎన్నికలలో టిఆర్ఎస్ విజయం సాధిస్తూనే ఉందని, ఇప్పటి కైనా ప్రతిపక్షాలు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆయన అన్నారు.
టిఆర్ ఎస్ విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టిందని విమర్శిస్తున్నారని, మునిసిపల్ ఎన్నికలలో పార్టీ అభ్యర్ధుల కోసం పెట్టిన ఖర్చు కోటి రూపాయల లోపునేనని ఆయన అన్నారు. అది కూడా కేవలం పబ్లిసిటీ కోసమేనని ఆయన అన్నారు.