కేంద్రంపై బురద జల్లేందుకు అసెంబ్లీని వాడుకున్నారని కేసీఆర్పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత బడ్జెట్లో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. కేంద్రాన్ని విమర్శించిన కేసీఆర్ రాష్ట్ర పరిస్థితిపై ఎందుకు మాట్లాడరు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతేంటి? అంటూ కిషన్రెడ్డి ప్రశ్నించారు. ”అసెంబ్లీలో కేసీఆర్ పరిధి దాటి మోదీపై మాట్లాడారు.
బడ్జెట్ సమావేశాలా? మోదీ విద్వేశ సమావేశాలా?. నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి ఏమైంది?. విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడ లేదు. ఆధారాలు లేకుండా కేంద్రంపై ఆరోపణలు చేశారు. కుటుంబ పాలనపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు. దేశ పరిస్థితులపై కేసీఆర్కు అవగాహన లేదు” అంటూ ఆయన దుయ్యబట్టారు. ”దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చకు మేం సిద్ధం. ప్రగతి భవన్ లేదంటే ఫామ్హౌజ్కు చర్చకు రమ్మంటారా?. అభివృద్ధిపై చర్చకు కేసీఆర్ ఎక్కడకు రమ్మన్నా వస్తాం. రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని వస్తే రండి. అసలు కేసీఆర్ను రాజీనామా ఎవరు అడిగారు?. వచ్చే ఎన్నికల తర్వాత ఎలాగు రాజీనామా చేయ్సాలిందే” అని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు.