పశ్చిమ గోదావరి జిల్లా లోని ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణమంతా మలిన రహితంగా తీర్చి దిద్ది భక్తులకు ఆరోగ్య వంత మైన ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని కలిగించాలని ఆలయ ఈ ఓ జి వి సుబ్బా రెడ్డి దేవస్థాన ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు.
సోమవారం ఆలయ ఉద్యోగుల విధి విధానాలు, భక్తులకు అందించే సేవలపై ఈ ఓ దేవస్థాన ఉద్యోగులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఆలయ ప్రాంగణం కలియుగ వైకుంటాన్ని తలపించే విధంగానూ, అత్యంత వైభవ ప్రదేశం గా ఉంచాలని ఆయన కోరారు.
గోశాల, నిత్యా భోజన శాల, సెక్యూరిటీ నిర్వహణ, ఔట్ సోర్సింగ్ సూపర్ వైజర్లు, శానిటేషన్ సిబ్బంది వంటి విభాగాలు అంకితభావంతో పనిచేయాలన్నారు. దేవాలయం లో పనిచేసే విభాగాలన్నింటి లో ఎక్కడా ఏ లోపం లేకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత సూపరవైజర్లదేనని ఈ ఓ గుర్తు చేశారు.
స్వామివారి దేవాలయంలో విధులు నిర్వహించడం పూర్వజన్మ సుకృతమన్నారు. స్వామివారి కొలువులో పనిచేయడం ఓ అదృష్టం అని చెప్పారు.
ఆలయ ఉద్యోగులంతా క్రమశిక్షణ తో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పారు. విడినిర్వహణలో నిర్లక్ష్యం, దురుసుతనం, మోసం, భక్తుల పట్ల అమర్యాద వంటి ప్రవర్తన లపై పిర్యాదులొస్తే కఠిన చర్యలు తప్పవని ఈ ఓ సుబ్బారెడ్డి సిబ్బందిని హెచ్చరించారు.
స్వామివారి సన్నిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్యూరిటీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.