సుపరిపాలన అందించేందుకు తమకు ఒక అవకాశం ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ ప్రజలను కోరారు. మరికొన్ని నెలల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆయన అప్పుడే రంగంలోకి దిగారు.
పంజాబ్లో ఘన విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్, కర్నాటక,గుజరాత్పై దృష్టిసారించింది.
గుజరాత్ లోని భరూచ్లో నిర్వహించిన ఆదివాసీ సంకల్ప్ మహాసమ్మేళన్లో కేజ్రీవాల్ మాట్లాడారు. గుజరాత్ లో తమకు ఎలాంటి ఆందోళన లేదని బీజేపీ నేత ఒకరు చెప్పారని అయితే, బీజేపీ దురహంకారానికి బ్రేక్ వేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
తాను ఆరున్నర కోట్ల మంది గుజరాత్ ప్రజలను కోరుతున్నానని ఈసారి తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని అన్నారు. తమ ప్రభుత్వ పనితీరు నచ్చకుంటే ఆ తర్వాతి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని తరిమి కొట్టాలని కేజ్రీవాల్ అన్నారు. తాను చాలా నిజాయతీపరుడినని, తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని అన్నారు.
బిజెపి తనపై ఎన్నో విచారణలు జరిపించినా ఏమీ రుజువు చేయలేదని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని చూసి బీజేపీ భయపడుతున్నట్టుగా ఉందని విమర్శించారు. గుజరాత్లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయన్న ఊహాగానాలపై కేజ్రీవాల్ స్పందిస్తూ తనకు కూడా ఈ విషయం తెలిసిందని ఆయన అన్నారు.
ఎన్నికలు ఇప్పుడు నిర్వహించినా, ఆరు నెలల తర్వాత జరిపినా తామే గెలుస్తామని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.