సంక్రాంతి పురస్కరించుకొని తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతానికి భారీ వాహనాలు రానున్న నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా నందిగామ డిఎస్పీ జి వి. రమణ మూర్తి, నందిగామ రూరల్ సీఐ సతీష్ ఆధ్వర్యంలో కీసర టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాట్లు చేశారు. అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలలోని తమ సొంత గ్రామాలకు పండగకు వస్తారనే ఉద్దేశ్యంతో చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే కార్లు, బస్సులతో రద్దీ ఎక్కువగా ఉండి ట్రాఫిక్కు అంతరాయం కలిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున, కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేశారు.
ప్రతి క్యూలైన్ వద్ద టోల్ ఫ్లాజా సిబ్బందిని కూడా పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ అయిపోయిన తరువాత విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని, పైన తెలిపిన విధంగా టోల్ ప్లాజా వారు ప్రత్యేక కౌంటర్లు, సిబ్బందిని పెంచుకొని పోలీసువారికి సహకరించాలని నందిగామ డి.ఎస్.పి జి వి రమణ మూర్తి తెలిపారు.