ఇంత కాలం తెలుగుదేశం, జనసేన పార్టీలపై అడ్డుఆపూ లేకుండా విమర్శలు చేసిన పేర్ని నానికి ఈ సారి టిక్కెట్ ఇచ్చేందుకు కూడా వైసీపీ సిద్ధంగా లేదా? తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తున్నది. వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయనని, తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని గత కొద్ది రోజులుగా పేర్నినాని కోరుతున్నారు.
అయితే వచ్చే ఎన్నికలు ఎంతో కీలకమైనవని, సరైన అభ్యర్ధులను నిలబెట్టకపోతే ఓటమి తప్పదని అనుకుంటున్న వైసీపీ నేతలు మాత్రం పేర్ని నాని యే రాబోయే ఎన్నికలలో పోటీ చేయాలని చెబుతూ వచ్చారు. తన కుటుంబంలో ఉన్న విభేదాల కారణంగా పేర్ని నాని తన కుమారుడికి టిక్కెట్ ఇప్పించుకోవడం తప్పని సరి. తన కుమారుడికి టిక్కెట్
ఇవ్వకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా నాని ఆ మధ్య కాలంలో వైసీపీ పెద్దలను హెచ్చరించారు. అప్పటిలో నానిని మళ్లీ పోటీ చేసేందుకు వైసీపీ పెద్దలు ఎలాగోలా ఒప్పించారు. అయితే ఇటీవలి కాలంలో పార్లమెంటు సభ్యుడు బాలశౌరితో పేర్ని నానికి విభేదాలు పెరిగిపోయాయి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తలెత్తింది.
నియోజకవర్గంలో పేర్ని నానికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడిందని వైసీపీ పెద్దలకు నివేదికలు అందాయి. వాటన్నింటి దృష్ట్యా పేర్ని నానికి టిక్కెట్ ఇవ్వరాదని వైసీపీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై స్పష్టత లేని పేర్ని నాని తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలనే ఇంకా కోరుతున్నారు. అయితే కుమారుడికి కాదు కదా తనకు కూడా టిక్కెట్ దక్కడం లేదని ఇటీవల వైసీపీ కీలక నేతల ప్రవర్తనతో చూచాయగా అర్ధం కావడంతో ఆయన రాజకీయ సన్యాసం డ్రామా మొదలు పెట్టారని అంటున్నారు.
బందరు పోర్టుకు శంకుస్థాపన సందర్భంగా జరిగిన సభలో సీఎం జగన్ సమక్షంలోనే పేర్ని నాని రాజకీయ సన్యాసం ప్రస్తావన చేశారు. పేర్ని నాని రాజకీయ సన్యాసం ప్రస్తావన చేసిన తర్వాత కూడా వైసీపీ కీలక నేతల నుంచి ఎలాంటి స్పందన లేదు. శంకుస్థాపన సభలో పేర్ని నాని మాట్లాడిన మాటలను బాలశౌరి వర్గం పూర్తిగా తనకు అనుకూలంగా మలచుకున్నది. పేర్ని నాని జగన్ ను ఏకవచనంతో సంబోధించారని, ఇది అలవాటు అయితే అందరూ జగన్ ను ఇక నుంచి అలానే సంబోధిస్తారని వైసీపీ కీలక నేతలకు చెప్పడంతో వారు కూడా సీరియస్ గానే తీసుకున్నట్లు
చెబుతున్నారు. తాను రాజశేఖరరెడ్డితో కలిసి పని చేశానని చెప్పడం ద్వారా పేర్ని నాని తాను జగన్ కన్నా సీనియర్ ను అన్న సందేశం కూడా ఇచ్చారని ఇది కూడా వైసీపీ కీలక నేతలకు నచ్చలేదని అంటున్నారు. నియోజకవర్గంలో వ్యతిరేకత ఉండటంతో బాటు ఇన్ని కారణాలు కలిసి రావడంతో ఈ సారి ఎన్నికలలో పేర్ని నానికి మచిలీపట్నం టిక్కెట్ దక్కే అవకాశం లేదని అంటున్నారు. ఆయనకే కాదు ఆయన కుమారుడికి కూడా టిక్కెట్ వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు.